DNS Media | Latest News, Breaking News And Update In Telugu

71 ఎకరాల ఎయు భూముల్లో చెట్లు కూల్చి ప్రైవేటు వాళ్ళ వ్యాపారాలా?

రూ. 3 వేల కోట్ల విలువ భూముల నాశనం పై  జనసేన మండిపాటు 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జూన్  13, 2022 (డిఎన్ఎస్):* ప్రపంచం యావత్తు పర్యావరణ పరిరక్షణకు పరుగులు తీస్తుంటే ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర విశ్వవిద్యాలయ యాజమాన్యం ఏయూ ఇంజినీరింగ్ క్యాంపస్ లో వేల చెట్లు నరికి

విద్యార్థులకిచ్చే సందేశమేంటి... చెట్లు నరికి మానవ జాతి వినాసనానికి పాటుపడతారా  అని 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తన వార్డు పరిధిలో ఉన్న ఏయూ ఇంజినీరింగ్ క్యాంపస్ లోని 71 ఎకరాల్లో వృక్ష సంపదను జేసీబీలతో తొలిగించి రుషికొండ కంటే భారీ

విద్వాంసానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు.  ఒక ఎకరంలోని చెట్లు 18మందికి అవసరమైన ఆక్సిజన్ అందిస్తాయి. ఈ లెక్కన రోజుకి 1278 మందికి బ్రతకడానికి అవసరమైన 71 ఎకరాల్లో చెట్లు తొలిగించిన ఏయూ విద్యాధికులకు కోవిడ్ లో ఆక్సిజన్ అందక మృత్యువాత పడిన వారి మరణ కేకలు గుర్తుకు రాకపోవడం విస్మయానికి గురిచేస్తోందన్నారు. గడ్డి

మేయడానికి వెళ్లిన గోవునే హత్య చేసిన ఏయూ సెక్యురిటీ సిబ్బంది ఏయూలో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. 20 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయాయి, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని కుంటి సాకులు చెబుతున్న ఏయూ అధికారులు ఇప్పటి వరకు పోలీసులకు  ఫిర్యాదు ఎందుకు చేయలేదన్నారు. అన్యాక్రాంతం, అసాంఘిక

కార్యకలాపాలు పేరుతో ప్రభుత్వానికి, నగర ప్రజలకు తప్పుదోవ పట్టించి విశ్వవిద్యాలయాన్ని వ్యాపార కేంద్రంగా మార్చే కుట్ర జరుగుతోందన్నారు.  గీతం, గాయత్రి విద్యాపరిషత్ వంటి విశ్వ విద్యాలయలు స్వచ్ఛమైన విద్యానందిస్తుంటే ఏయూ మాత్రం తమ స్థలాలను ప్రయివేటు కార్యకలాపాలకు అద్దెకిస్తూ వ్యాపారాన్ని చేస్తుందన్నారు.  ఏయూలో

ఉన్నది వీసీయా వ్యాపారవేత్తా, ఏయూ విద్యాలయమా వ్యాపార కేంద్రమా ముందు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.  నగరం నడిబొడ్డున  ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా ఉన్న  71ఎకరాల స్థలాన్ని విశ్వవిద్యాలయ అధికారులు అసాంఘిక కార్యక్రమాల పేరిట ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలు ప్రారంభించారన్నారు. అందులో భాగంగా వేలాది చెట్లను నరికి

వేశారన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా చివరకు విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ అధికారులు కూడా సంప్రదించకుండా ఇద్దరు ఈ సీ సభ్యులు స్వంత నిధులతో  సహకరిస్తున్నారంటూ  జేసీబీ లతో  పక్షం రోజులుగా విధ్వంసం చేస్తున్నారన్నారు. ఎక్స్ పైర్ అయిపోయిన కండోమ్ ప్యాకెట్ లను గుట్టగా  పొసి  పాత రేకులతో చిన్న షెడ్డు లాంటి దానిని

నిర్మించినట్లు చూపి విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులే స్వయంగా ఈ విధ్వంసానికి పాల్పడుతుండడం గమనార్హమన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నుంచి రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు అంతా  ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్న సమయంలో  బాగా చదువుకున్న విశ్వవిద్యాలయం

ఉన్నతాధికారులు  కొన్ని కండోమ్ ప్యాకెట్లను బూచీగా చూపి  వేలాది చెట్లు, మొక్కలను అడ్డగోలుగా నరికివేస్తుండడం  నగరవాసులను, పర్యావరణ ప్రేమికులను కలవరపెడుతోందన్నారు. చెట్లను నరికివేయడమే కాకుండా  సహజసిద్దంగా ఏర్పడి, నగర భూగర్భజలాలను కాపాడుతూ వస్తున్న చెరువును, కుంటలను పూడ్చివేయడం మరీ దారుణం. చెరువులు, నీటి

కుంటల స్వరూప స్వభావాలను మార్చే హక్కు ఎవరికీ లేదంటూ హైకోర్టు, సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టం చేసినప్పటికీ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు  కోర్టు ల ఆదేశాలను ధిక్కరిస్తూ పర్యావరణానికి ,జీవావరణానికీ తీరని ద్రోహం చేస్తున్నారన్నారు. ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో చెట్లను నరికి వేసి చెరువులు కుంటలు పూడ్చడం వల్ల

 పక్కనే వున్న   శివాజీ పాలెం, బలరాం నగర్, మంగాపురం కాలనీ తారామసీదు, పిఠాపురం కాలనీ, డాక్టర్స్ కాలనీ తదితర ప్రాంతాలకు తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.   ఈ విధ్వంసం వల్ల నగరంలో సగం మంది నాగుల చవితి నాడు పూజలు చేసే ప్రాంతమంతా మాయమైపోయిందన్నారు.

 వేల కోట్ల రూపాయల విలువైన

భూముల్లో సహజసిద్ధంగా ఏర్పాటైన చిన్నపాటి అడవిని రాత్రికి రాత్రి తొలగించేందుకు పొడైపోయిన కండోమ్  ప్యాకెట్లను సాకుగా  వినియోగించుకునే దుస్థితికి ఉన్నతాధికారుల చేరుకోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. నిజంగా విశ్వవిద్యాలయంలో బాగా పెరిగిన చెట్ల వల్ల అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే పొదలను, చెట్ల కొమ్మలను

తొలగించాలి. చెట్లను కూకటివేళ్ళతో పెకలించి కూడదు. పాకలో ఎలుక దూరిందని పాకకే నిప్పు పెట్టి తగలెట్టినట్టుగా వుంది ఏ యూ పాలకుల వ్యవహారం.  ఎం ఆర్ అప్పారావు లాంటి గొప్ప వైస్ ఛాన్సలర్   తన హయాంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 400 రకాల మొక్కలను  రప్పించి నాటారని గుర్తు చేశారు  .ఆ చెట్లను  ఇప్పటి పాలకులు తొలగించడం వారి

అధికార దుర్వినియోగానికి నిదర్శనం. విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు ఇప్పటికైనా మేల్కొని విశ్వవిద్యాలయంలో జరుగుతున్న  ప్రకృతి, పర్యావరణ విధ్వంసాన్ని నిలిపివేసి రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున చేపట్టిన వన  మహోత్సవంలో భాగంగా  మొక్కలను చెట్లు తొలగించిన  ప్రాంతాల్లో  నాటాలి. విధ్వంసానికి  కారణమైన

ఉన్నతాధికారులపై చట్టపరంగా  చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాల్టా చట్టాన్ని ఇతర ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఈ విధ్వంసానికి పాల్పడిన  ఈసీ మెంబర్ ఏసుపాదం, మరో సభ్యుడు  స్టీఫెన్ ల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాం  లో ఆంధ్ర విశ్వ విద్యాలయం హై స్కూల్ పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని

ప్రైవేట్ ఐ టీ కంపెనీ కి దారాదత్తం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలకు దిగిన  వైయస్సార్ కాంగ్రెస్ నేతలు తమ ప్రభుత్వం వచ్చాక  ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణాన్నే  ప్రవేట్ పరం చేయాలని చూడడం ద్వంద్వ వైఖరే. ఇకనైనా తప్పు సరిదిద్దుకొని ఆంధ్రా  విశ్వవిద్యాలయం ప్రాంగణంలో  విద్యాపరమైన కార్యకలాపాలకు

ప్రాధాన్యతనిస్తూ వాణిజ్యపరమైన కార్యక్రమాలను నిషేధించాలని కోరారు.ఏయూలో జరుగుతున్న వృక్ష విద్వాంశాన్ని దేశంలోని అన్ని యూనివర్సిటీల దృష్టికి తీసుకుని వెళ్లి ఆయా యూనివర్సిటీల అభిప్రాయం సేకరించి వైసీపీ ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ఆప్పుడైనా ఈ ప్రభుత్వం స్పందించి ఏయూ విద్వాంశకులపై చర్యలు తీసుకుంటుందని

ఆశిస్తున్నామన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam