DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైల్వే జీఎం ముందు డిమాండ్ల చిట్టా విప్పిన రాజమండ్రి ఎంపీ భరత్ 

*DNS Report : P. Raja, Bureau Chief, Amaravati*   

*అమరావతి, ఏప్రిల్ 18, 2023 (డిఎన్ఎస్  DNS Online ):* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ, విజయవాడ తరువాత ఆ స్థాయిలో రైల్వే శాఖకు భారీ ఆదాయం వచ్చే సాంస్కృతిక, పర్యాట రాజధానిగా గుర్తింపు పొందిన రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ల (మెయిన్, గోదావరి) అభివృద్ధికి తగు చర్యలు తీసుకోవాలని సౌత్ సెంట్రల్ రైల్వే

జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ విజ్ఞప్తి చేశారు. ‌ఈ మేరకు ఆయన హైదరాబాదులో రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ను స్వయంగా కలిసి ఇందుకు సంబంధించి పలు విజ్ఞప్తులను, సూచనలను ఎంపీ భరత్ ఇచ్చారు. ఒక్క రాజమండ్రి నగర రైల్వే స్టేషన్ల గురించే

కాకుండా ప్రధానంగా రాజమండ్రి పార్లమెంటు నియోజక వర్గ పరిధిలోని అనపర్తి, కేశవరం రైల్వేస్టేషన్లలో చేపట్టవలసిన అభివృద్ధిపై కూడా జీఎంతో ఎంపీ భరత్ సుదీర్ఘంగా చర్చించారు. 

రాజమండ్రి తూర్పు రైల్వే స్టేషను అభివృద్ధి..

రాజమండ్రి ప్రధాన రైల్వేస్టేషన్ కు తూర్పు వైపున మరో ప్లాట్‌ఫారమ్ నిర్మాణ

ఆవశ్యకతను ఎంపీ భరత్ ఈ సందర్భంగా జీఎంకు వివరించారు. ‌అంతే కాకుండా ప్రస్తుతం ఉన్న బొగ్గు సైడింగ్, బ్యాలస్ట్ ఏరియాల మార్పు ఆవశ్యకతను చాలా వివరంగా ఎంపీ భరత్ తెలియజేశారు. ‌రైల్వే స్టేషను తూర్పు వైపున కోల్ సైడింగ్ ఏరియాలో 20వేల చదరపు మీటర్ల విస్తీర్ణం అందుబాటులో ఉందన్నారు. ‌ఇక్కడ ఉన్న సైడింగ్ లో నలుసు పదార్థాలు భారీ

కాలుష్యాన్ని, ఈ చుట్టు పక్కల నివాసిత ప్రజల ఆరోగ్యానికి తీరని నష్టం చేకూరుస్తోందని తెలిపారు. ఈ సైడింగ్ లను వెంటనే మరో చోటకు, పొలిమేరలకు మార్చమని రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ కు ఎంపీ భరత్ విజ్ఞప్తి చేశారు. ‌తద్వారా నివాస యోగ్యమైన, ఆరోగ్యకరమైన ప్రాంతంగా అభివృద్ధి చేయాలని సూచించారు. సైడింగ్స్ ప్రాంతంలో అత్యాధునిక

సదుపాయాలతో కూడిన మల్టీ మోడల్ ట్రాన్సిట్ హబ్ గా మార్చడం వల్ల రైల్వే శాఖకు ఆర్థికపరమైన వనరులు సమకూరతాయని తెలిపారు. మాల్స్, మల్టీప్లెక్స్, ప్లే జోన్, కిడ్ జోన్స్ ఫుడ్ వంటి వివిధ సౌకర్యాలతో అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించాలని సూచించారు. ‌ప్రస్తుతం ఉన్న సైడింగ్ ల వల్ల నగరాభివృద్ధికి అవరోధంగా ఉందన్నారు. అలాగే

రిలయన్స్ డిజిటల్ మాల్స్ కు ఆనుకుని ఉన్న స్టేషన్ కు పశ్చిమం వైపు శిథిలావస్థలో ఉన్న గూడ్స్ షెడ్ ఏరియాలో ఖాళీ స్థలం పరిశీలించి వాణిజ్య అభివృద్ధి కోసం వినియోగిస్తే బాగుంటుందని, ఈ ప్రతిపాదనను పరిశీలించాల్సిందిగా ఎంపీ భరత్ కోరారు. ఐఆర్సీఓఎన్ డెవలపర్స్ కు ఇచ్చిన ల్యాండ్ పార్శిల్ చట్టపరమైన వివాదానికి దారితీసిందని,

ప్రస్తుతం డెవలపర్స్, రైల్వే ఇష్యూ ఏపీ హైకోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. రైల్వే శాఖకు ఆదాయం పెంచే పనిలో నిమగ్నమైన ఆర్ఎల్డీఏ కు అప్పగిస్తే ఎలా ఉంటుందనే విషయమై యోచించాల్సిందిగా కోరారు. ‌

చిత్రాంగి ప్యాలెస్..నిరుపయోగం..

రాజమహేంద్రవరాన్ని పాలించిన‌ రాజరాజనరేంద్రుని భార్య పేరున నిర్మించిన

'చిత్రాంగి' ప్యాలెస్ రైల్వే అధికారులకు రెస్ట్ హౌస్ గా ఉపయోగిస్తున్నారని, కానీ నేడది అందుకు తగ్గట్టుగా లేదన్నారు. అసాంఘిక శక్తులకు, దుర్వ్యసనపరులకు ఆలవాలంగా తయారై భయానక వాతావరణాన్ని తలపిస్తోందన్నారు. చారిత్రక వారసత్వ భవంగా ప్రాముఖ్యత ఉన్న ఈ ప్యాలెస్ ను 'స్వచ్ఛ మరియు సుందర్' నగరాభివృద్ధిలో భాగంగా మార్పు

చేసి సమాజాభివృద్ధికి దోహదపడే విధంగా చేయాలని ఎంపీ భరత్ కోరారు. ఏపీ ప్రభుత్వం హేవలాక్ సమీపంలోని రైల్వే భూమిని కోరుతోందన్నారు. పర్యాటకం, రహదారి అభివృద్ధికి. మున్సిపల్ కమిషనర్ రాజమండ్రి రైల్వే కోసం వీఎల్ పురం లోని భూమిని ఎంపిక చేశారని, ఈ ఇష్యూ తుది దశకు చేరుకుందని రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ కు ఎంపీ భరత్

వివరించారు. 

అనపర్తి, నిడదవోలు.. రైల్వేస్టేషన్ల అభివృద్ధిపై..

అనపర్తి, నిడదవోలు రైల్వే స్టేషన్ల అభివృద్ధి విషయమై జీఎంతో ఎంపీ భరత్ చర్చించారు. ‌అనపర్తి, కేశవరం లెవెల్ క్రాసింగ్ (ఎల్సీ)ల వద్ద ఆర్ఓబీలు నిర్మించమని సూచించారు. ‌కడియం- ద్వారపూడి మధ్య కేశవరం (ఎల్ సీ-404) 2020-21లో ఆర్ఓబీ మంజూరుకు అగ్రిమెంట్

ఖరారైన విషయాన్ని ఈ సందర్భంగా జీఎంకు జ్ఞాపకం చేశారు. ‌అలాగే అనపర్తి, నిడదవోలు రైల్వే స్టేషన్లలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ హాల్ట్ అందించాలని కోరారు. 

గోదావరి రైల్వే స్టేషన్లో ఎఫ్ఓబీ..

రాజమండ్రి గోదావరి రైల్వేస్టేషన్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్ఓబీ)ని చాలా కాలం క్రితం నిర్మించారని, అయితే దక్షిణం

వైపు నుండి ఉత్తరం వైపు వరకూ పాదచారుల సౌకర్యార్ధం నిర్మించిన ఈ ఎఫ్ఓబీ ప్రస్తుతం స్టేషను కు వచ్చే ప్రయాణికులకు మాత్రమే ఉపయోగపడేలా ఆఫ్ చేయబడిందన్నారు. ఎఫ్ఓబీ నిర్మించమని కోరారు. అలాగే రాజమండ్రి ప్రధాన రైల్వేస్టేషన్ గూడ్స్ షెడ్ వద్ద ఆర్వోబీ ప్రతిపాదన మంజూరు చేయమని కోరారు. ప్రస్తుతం గూడ్స్ షెడ్ వద్ద ఉన్న ఆర్ఓబీ

ప్రయాణికులకు ఇబ్బందిగా ఉందని, అదనపు సబ్ వే నిర్మించాలని ఎంపీ అభ్యర్థించారు. అలాగే అన్నపూర్ణమ్మ పేట ఎల్సీ 394 వద్ద ఆర్ఓబీ నిర్మించాలని కోరారు. 

రాజమండ్రిలో ఆ ఆరు రైళ్ఖు ఆగాలి..

సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో బెజవాడ తరువాత ఆర్థిక రాబడిలో రెండవ అతి పెద్ద స్టేషను రాజమండ్రి రైల్వే స్టేషను అని..ఈ

నగరానికి సుదూర ప్రాంతాల నుండి యాత్రికులు, పర్యాటకులు వస్తుంటారని ఎంపీ భరత్ వివరించారు. అయితే ప్రధానమైన హౌరా టు శ్రీ సత్యసాయి నిలయం ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ టు రాజమండ్రి ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ టు పూణే ఎక్స్‌ప్రెస్, చెన్నై టు జల్వాయిగుడి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, కామాక్య టు యశ్వంత్పూర్ ఏసీ ఎక్స్‌ప్రెస్,

పుదుచ్చేరి టు హెచ్డబ్ల్యూహెచ్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు నిలుపదలకు అనుమతి మంజూరు చేయాలని రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ను ఎంపీ భరత్ కోరారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam